రైతు చట్టాలకు మద్దతుగా అన్నదాతల ర్యాలీ

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధానిలోని శివారులో దాదాపు నెల రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రోజుకో తరహాలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే తాజాగా ఈ చట్టాలకు మద్దతుగా వీరిలోనే మరోవర్గం ర్యాలీలకు పూనుకొంది. యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి బయలుదేరారు. పశ్చిమ యూపీ నుంచి హింద్ మజ్దూర్ సమితికి చెందిన రైతులతో బాటు హర్యానా నుంచి రెండు గ్రూపులు, ఉత్తరాఖండ్ నుంచి ఓ గ్రూపు అన్నదాతలు హస్తిన బాట పట్టారు. సుమారు 20 వేలమందికి పైగా రైతులు నిన్న సాయంత్రం ర్యాలీకి తెర తీశారు. యూపీలో మధుర, ఆగ్రా, ఫిరోజాబాద్, ముజఫర్ నగర్, మీరట్, హత్రాస్ తదితర జిల్లాలకు చెందిన రైతులు వీరిలో ఉన్నారు. కిసాన్ సేన కన్వీనర్ ఠాకూర్ గౌరీ శంకర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తమ ర్యాలీకి అధికారుల నుంచి అనుమతి కోరామని, కానీ స్పందన లేదని చెప్పారు. ఏమైనా తామంతా ఢిల్లీకి వెళ్తున్నామని అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్లో తమ రాష్ట్రానికి చెందినవారు లేరని ఆయన తెలిపారు. తాము వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసి రైతు చట్టాలకు తమ మద్దతు తెలియజేస్తామన్నారు.