అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజులు వాపస్..!

కేంద్ర ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఓ శుభవార్త ప్రకటించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి నవంబర్‌ 30 వరకు యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మిషన్లు రద్దు చేసుకున్న వలస వెళ్లిన విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారం పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ ఒక్క విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేకంగా అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ను యూజీసీ పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిషన్‌ ఆమోద ముద్ర వేసిందని రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. దీంతో అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కోర్సుల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నవంబర్‌ 30 వరకు రద్దు చేసుకునే విద్యార్థులు, వలసవెళ్లిన విద్యార్థులు వారు చెల్లించిన ఫీజులు తిరిగి పొందుతారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.