మారుతి దర్శకత్వంలో గోపీచంద్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులముందుకు

టాలీవుడ్‌లో హిట్ కోసం వేచి చూస్తున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. చాలాకాలంగా ‘లౌక్యం’ తర్వాత ఆయనకి సరైన హిట్ లేదు. ప్రతి సినిమాకి ఆయన ఎంతగానో ఎఫర్ట్ పెట్టినా.. హిట్ మాత్రం లేకపోవడంతో అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో నిరాశగా ఉన్న గోపీచంద్ అభిమానులకు పండగచేసుకునే లాంటి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో నడుస్తుంది. ఏంటా పండగలాంటి వార్తoటే  ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సినిమా ఉండబోతుందని అంటున్నారు.

ప్రస్తుతం సంపత్ నందితో గోపీచంద్ ‘సీటీమార్’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత లేదంటే తేజ చిత్రంతో పాటే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ మూవీ షూటింగ్ ఉండనుందని అంటున్నారు. ఈ మధ్య మారుతి సక్సెస్ రేట్ మాములుగా లేదు. అసలైతే ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత అల్లు అర్జున్‌తో మారుతి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజంకాదని మారుతినే స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ లాక్‌డౌన్‌లో మారుతి అద్భుతమైన కథ తయారు చేశారని, నిజంగా గోపీచంద్‌తో ఆయన సినిమా చేస్తే.. గోపీకి ఖచ్చితంగా హిట్ పడుతుందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ వార్తకై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.