ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం జగన్

నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని వివరించారు. పుష్కలంగా సహజ వనరులను కలిగిన, ఘనమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రం ఏపీ అని అభివర్ణించారు. ఈ సమయంలో రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములును స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

అటు, సీఎం జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. తెలుగు తల్లికి, రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పిస్తారు.