తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఒడిశా తీరం వద్ద నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు వరకు 1500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

నిన్న రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిశాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి. సాధారణం కంటే 7 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. ఇక కుమురంభీం జిల్లా వెంకట్రావుపేటలో అత్యధికంగా 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.