తెలంగాణలో కరోనా కట్టడి పై హై కోర్ట్ ప్రశ్నల వర్షం

తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రమంతా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా.. ఎక్కడ తగ్గాలో చూపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ విధిస్తే ఉదయం వేళల్లో పబ్లిక్ ప్లేస్, బార్ అండ్ రెస్టారెంట్, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, కుంభమేళాకు వెళ్ళొచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నారని మరి తెలంగాణలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఎందుకు 24 గంటల్లో ఇవ్వడం లేదని నిలదీసింది. కేవలం వీఐపీలకు మాత్రమే 24 గంటల్లో టెస్ట్ రిపోర్టులు ఇస్తున్నారని, సామాన్యులకు ఇవ్వడం లేదని హైకోర్టు ఆరోపణలు చేసింది. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ రాష్ట్రంలోనే తయారు చేస్తున్నా ప్రజలకు మాత్రం అందుబాటులో లేవని, రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల చెబుతుంటే, గతంలో సరిపడా ఆక్సిజన్ ఉందని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిందని ఇందులో ఏది నమ్మాలని ప్రశ్నించింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్ని కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసింది? శ్మశానవాటికల్లో రోజుకు ఎంతమందికి అంత్యక్రియలు చేస్తున్నారు? 108 అంబులెన్స్‌లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? వలస కార్మికుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి సమాచారాన్ని అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.