తిరుపతి అభ్యర్థిపై నిర్ణయాన్ని జనసైనికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా..

తిరుపతి పార్లమెంటు స్థానంలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ పార్టీకి చెందిన నేత తిరుపతి బరిలో దిగుతాడన్న దానిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టతనిచ్చారు. ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమని భావించామని వెల్లడించారు. 1999లో తిరుపతి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు.

“ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. జనసేన పార్టీ తరఫున మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతోపాటు పార్టీ జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావడానికే అని గమనిస్తారని ఆశిస్తున్నా. తిరుపతి అభ్యర్థిపై నిర్ణయాన్ని జనసేన శ్రేణులు దూరదృష్టితో ఆలోచిస్తాయని భావిస్తున్నా” అంటూ సందేశం వెలువరించారు.