సీఎం గాల్లో ప్రయాణిస్తుంటే… హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి?

తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డికి హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం శ్రీ జగన్ రెడ్డి గాల్లో ప్రయాణించి వెళ్తే అటు శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర, ఇటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉంది. గంటల తరబడి వాహనాలు ఆపివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి చర్యలు చూస్తుంటే ముఖ్యమంత్రిలో రోజురోజుకీ అభద్రతాభావం పెరిగిపోతోంది. పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్టగా భోగాపురానికి అటూయిటూ 150 కి.మీ. దూరాన హైవేపై వాహనాలు ఆపివేయడంతో సామాన్యులు ఇబ్బందిపడ్డారు. సీఎం భోగాపురం పర్యటన నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్, శ్రీమతి పతివాడ కృష్ణవేణి, పతివాడ అచ్చన్నాయుడు, కారి అప్పలరాజు తదితరులను అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం అప్రజాస్వామికం. ఈ అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.