ఆ మున్సిపాలీటీ పరిధిలో మాస్క్‌ లేకపోతే రూ.1000 జరిమానా‌..

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రత్యేకంగా తెలంగాణలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటంతో బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేసింది. ప్రజలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారంటూ ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే, మెదక్‌ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రామాయంపేట మున్సిపల్‌ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి (మార్చి 25) నుంచి మున్సిపాలిటీ పరిధిలో మాస్కులు లేకుండా సంచరించే ప్రజలకు రూ.100, వ్యాపార సంస్థల్లో మాస్క్‌ లేకుండా తిరిగేవారికి రూ.1000 జరిమానా విధించాలని నిర్ణయించారు. రెండోసారి కూడా మాస్క్‌ లేకుండా కనిపిస్తే రూ.500 జరిమానా, వ్యాపార సంస్థలకు రూ.5 వేలు, మూడోసారి మాస్క్‌ లేకుండా పట్టుబడితే వ్యాపార సంస్థలకు శాశ్వతంగా లైసెన్సులు రద్దు చేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేంద్ర గౌడ్‌ తెలిపారు. కాగా, రామాయంపేట మున్సిపాలిటీలో కరోనా కేసులు సుమారు 10కి చేరాయి. ప్రస్తుతం బాధితులంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.