రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు ఎందుకు?

వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ రోజు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్ళిన శ్రీ చంద్రబాబు గారిని అడ్డుకొనేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి? ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ… విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నాం. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారు. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారు. నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలుపెట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని అర్థమవుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని ఈ పాలకులు తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.