భీవండి ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో మూడంతస్తుల భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. వీరిలో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. సహాయక చర్యలు చేపడుతోన్న ఎన్డీఆర్ఎఫ్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. శిధిలాల కింద పడి తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవనంలో దాదాపు 20కి పైగా ఫ్లాట్లు ఉండగా.. తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో మృతులు, గాయపడినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. భవనంలో నివసిస్తున్న వారంతా గాఢ నిద్రలో ఉండగానే.. సోమవారం తెల్లవారుజూమున నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం సంభవించగానే.. స్థానికులు హుటాహుటిన 20 మందిని కాపాడారు. వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. భీవండీ పట్టణంలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించారు.