ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం సింహవాహనంపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్పస్వామి భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయమర్ధన చిన్నికృష్ణుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.

ముత్యాల నిర్మల కాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడోరోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు.