మూడోవన్డేలో భారత్ ఓటమి
కొలంబో: ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో భారీ మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆఖరి పోరులో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన పోరులో.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. యువ ఓపెనర్ పృథ్వీ షా (49), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (46), సూర్యకుమార్ (40) రాణించారు. లక్ష్యఛేదనలో అవిష్క ఫెర్నాండో (76), భానుక రాజపక్స (65) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో లంక 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
ఐదుగురి అరంగేట్రం..
భారత జట్టు ఈ మ్యాచ్లో ప్రయోగాలకు తెరలేపింది. నితీశ్ రాణా, రాహుల్ చాహర్, సకారియా, సంజూ, కృష్ణప్ప గౌతమ్లతో అరంగేట్రం చేయించింది. భారత్ తరఫున ఒకే మ్యాచ్లో ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇది రెండోసారి. 1980లో ఆస్ట్రేలియాపై దిలిప్ దోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ తొలి వన్డే మ్యాచ్ ఆడారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 225 (పృథ్వీ షా 49, సంజూ 46; అఖిల 3/44, ప్రవీణ్ 3/59), శ్రీలంక: 227/7 (అవిష్క 76, భానుక 65; రాహుల్ చాహర్ 3/54, సకారియా 2/34).