ఓటరుగా నమోదు కావడం మన బాధ్యత!

  • ఓటు అనే వజ్రాయుధంతో మంచి పాలకుల్ని ఎన్నుకోవచ్చు
  • రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • దేశ భవిష్యత్తు మార్చే సత్తా యువత చేతి ఓటులోనే ఉంది
  • ఓటు నమోదుపై ఎస్ఎస్ఎస్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన జనసేన నాయకులు

పార్వతీపురం: ఓటరుగా నమోదు కావటం 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్క యువతి యువకులు బాధ్యతగా తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు అన్నారు. బుధవారం పార్వతీపురం పట్టణంలోని ఎస్ఎస్ఎస్ కళాశాలలో విద్యార్థులకు జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, తామరకండి తేజ తదితరులు ఓటు నమోదు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా పొందాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే వజ్రాయుధంతో నీతి, నిజాయితీ, విలువలతో కూడిన నాయకుల్ని ఎన్నుకోవచ్చు అన్నారు. గ్రామం, పంచాయతీ, మండలం, జిల్లా, రాష్ట్ర, దేశ భవిష్యత్తు మార్చే సత్తా యువత చేతి ఓటు లోనే ఉందన్నారు. కాబట్టి 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతి యువకులు ఓటటుగా నమోదు కావాలన్నారు. ఓటు నమోదు కార్యక్రమం పై ఎన్నికల కమిషన్ డిసెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోందన్నారు. బి ఎల్ ఓ నుండి తాసిల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఓటు నమోదు కార్యక్రమంపై సేవలు అందిస్తున్నాయన్నారు. అలాగే కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలను కూడా చేపడుతున్నారన్నారు. దీనికోసం ఆధార్, పదో తరగతి జిరాక్స్ కాపీలతోపాటు రెండు ఫోటోలు తల్లి లేదా తండ్రి ఓటు కార్డు జిరాక్స్ కాపీ తదితర పత్రాలను ఫారం 6తో జతచేసి ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఆన్లైన్లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. కాబట్టి 18 ఏళ్ల నిండిన ప్రతీ యువతీ యువకులు ఓటరుగా నమోదు కావాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనంతరావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.