పేర్ని నానికి సవాల్ విసిరిన బొమ్మిడి నాయకర్

నర్సాపురం, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేని పక్షంలో ప్రజలే ఆయన తన్ని నియోజకవర్గం నుంచి బయటకు పంపే రోజులు వస్తాయని జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. గతంలో నాని మెగా కుటుంబానికి భజన చేసిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని, పేర్ని నాని నియోజకవర్గాలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే భావితరాల భవిష్యత్తుకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, జక్కం బాబ్జి, తోట నాని, వట్టిప్రోలు సతీష్, బొమ్మిడి కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.