పవన్ వ్యక్తిగత విషయాలు కాకుండా అభివృద్ధిపై జగన్ దృష్టి పెడితే బాగుంటుంది: గురాన అయ్యలు

  • జగన్ రెడ్డిపై జనసేన నేత అయ్యలు ఫైర్
  • యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు
  • జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అయ్యలు

విజయనగరం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై జగన్ మనసు పెడితే బాగుంటుందని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల మీద పవన్ కల్యాణ్ పోరాడుతుంటే, సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు కూడా జగన్ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ విమర్శించారు. సమాజంలో అలజడి సృష్టించే విధంగా, ఓటు బ్యాంకు రాజకీయాలను ముఖ్యమంత్రి చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. అధికారంలో లేకున్నా పవన్ కళ్యాణ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ముందుకు రావడం మానవత్వమని, అలాంటి వ్యక్తి పై పాలన చేతకాని సీఎం జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యువశక్తి కార్యక్రమం జనవరి 12వ తేదీన రణస్థలంలో జరుగుతుందని, జిల్లా నుండి యువత హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే ‘యువ శక్తి’ సభలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభల ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.