కృష్ణానదిలో మళ్లీ ప్రారంభం కానున్న జలవిహారం.. విహారయాత్రలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

విహారయాత్రలతో కృష్ణానది మళ్లీ కళ సంతరించుకోనుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన జలవిహారాలను పునరుద్ధరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పర్యాటక ప్యాకేజీలను శనివారం నుంచి పునరుద్ధరించనుంది. ప్రస్తుతం కృష్ణానది నీటిమట్టం లాంచీల ప్రయాణానికి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు.

కృష్ణా నదిలో విహారయాత్రలకు సంబంధించి పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.  హైదరాబాద్-శ్రీశైలం-సోమశిల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,999 చొప్పున వసూలు చేస్తారు. ఇది రెండు రోజుల ప్యాకేజీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రెండో ప్యాకేజీలో హైదరాబాద్-శ్రీశైలం-నాగార్జునసాగర్ యాత్ర. గతంలో ఈ యాత్ర శ్రీశైలం నుంచి సాగర్ వరకు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ రెండు యాత్రలు ఉదయం ఏడు గంటల సమయంలోనే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ ధర కూడా రూ. 3,999 మాత్రమే. ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు.