ద్వారపూడి రోడ్డు కోసం జనసేన దీక్ష

*కలెక్టరు మాటకు కూడా విలువ లేదు.
*అన్నంలో దుమ్ము ఎగిరి పడుతున్నా చలనం లేదు.

మండపేట, నాలుగేళ్లుగా మండపేట ద్వారపూడి రహదారి దుస్థితి కోసం రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదు. రోడ్డు అధ్వాన్న స్థితిని ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి అనేక రూపాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు చేసి చేసి అలసి పోయారు. ఇదే రోడ్డు బాగుచేయలని కొంతమంది సామాజిక కార్యకర్తలు రాష్ట్రపతి, కేంద్ర రహదారుల శాఖ కార్యాలయాలకు కూడా ఆన్ లైన్ ద్వారా విజ్ఞాపన పత్రాలు చెరవేసిన సందర్భాలు సైతం లేకపోలేదు. అయా సందర్భాల్లో ఢిల్లీ నుండి వచ్చిన ఒత్తిళ్లకు అధికారులు నామ మాత్రంగా మాత్రమే స్పందించి మమ అనిపించుకున్నారు. ఇదే బాటలో స్థానిక ప్రజా ప్రతినిథి కూడా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండి పడుతున్నారు. ప్రజలు, ప్రయాణికులు, వాహన దారులు సోషల్ మీడియాలో పెట్టే చివాట్లకు మెలకువ వచ్చి అప్పటికప్పుడు రూ 57 లక్షల నిధులతో కంకర బూడిదతో భారీ గోతులు పూడ్చి చేతులు దులుపుకున్నారు. ప్రజలేమై పోతే మాకేంటి అన్న విధంగా ఇక్కడి నాయకుల తీరు ఉందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్న ఎంత మాత్రం చలనం లేక పోవడం ఆశ్చర్యకరంగా ఉందని సీనియర్ సిటిజన్స్ పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల కోసం ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జనసేన పార్టీ ఆది నుండి రోడ్డు కోసం ప్రభుత్వానికి తన గళం వినిపిస్తూనే ఉంది. రోడ్డు పరిస్థితి మెరుగు పరచాలని కోరుతూ జనసేన పార్టీ తరపున ఆ పార్టీ మండల కన్వీనర్ కుంచే దుర్గా ప్రసాద్ గత 20 రోజుల క్రితం జిల్లా కలెక్టరును కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులను పిలిచి తక్షణమే బీటీ రోడ్డు నిర్మించాలని 20 రోజుల్లో పని పూర్తి చేసి నాకు తెలియ పరచాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో కుంచే దుర్గా ప్రసాద్ లేని పక్షంలో తాను నిరాహార దీక్ష చేస్తానని కలెక్టరు ముందే ఆయన తెగేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట అధికారులు నిలబెట్టు కోలేక పోయారు. కలెక్టర్ ఎదురుగానే నిరాహార దీక్ష చేస్తానని సవాల్ విసిరిన ప్రసాద్ మాట ప్రకారం ఆర్ అండ్ బి అధికారుల తీరుకు నిరసనగా సోమవారం ఇప్పనపాడు గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని అనుసంధానిస్తూ వెళ్లే మండపేట ద్వారపూడి రోడ్డు దుస్థితిని మళ్లీ తెర మీదకు తెచ్చారు. ఈ రోడ్డు నిర్మించడానికి అధికారులు టెండర్లకు ఆహ్వానిస్తునే ఉన్నారన్నారు. ఏడాదిన్నర కాలంగా గ్రామ ఫోన్ రికార్డింగ్ లా అధికారులు ఇదే మాట చెప్పడం సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. గుత్తేదారు టెండర్లకు రాకపోతే అధికారులే చొరవ తీసుకుని యుద్ద ప్రాతిపదికన రోడ్డు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించిన ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోక పోవడం దారుణంగా ఉందని విమర్శించారు. పైగా రోడ్డు సమస్య పరిష్కారం అయిందని గ్రీవెన్స్ ద్వారా తనకు మెసేజ్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించిందన్నారు. రోడ్డు విషయంలో ఎందుకింత జాప్యం జరుగుతోందో అర్థం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.

సాక్ష్యాత్తు కలెక్టరు మాటకు కూడా ఆర్ అండ్ బి అధికారులు విలువ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం అంతుపట్టడం లేదన్నారు. కొన్ని నెలల క్రితం రూ 57 లక్షలతో బూడిద కొట్టి పోయారని నిధులన్నీ బూడిద పాలయ్యాయే ఫలితం మాత్రం లేదన్నారు. రహదారి వెంట వెళ్ళే వాహనాల రాక పోకలకు దుమ్ము దట్టంగా గాలిలో కలిసి తద్వారా ఇళ్లల్లోకి వచ్చి పడుతుందన్నారు. తినే ఆహార పదార్థాల్లో కూడా దుమ్ము పడి అన్నం తింటుంటే నోటికి హితవు కాని పరిస్థితుల్లో ఇప్పనపాడు ప్రజలు జీవనం సాగిస్తున్నారని వివరించారు. ఇటువంటి దయనీయ పరిస్థితులు నెలకొన్నా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. దుమ్ము, ధూళి పడిన ఆహార పదార్థాలు తింటూ ఎంత కాలం జీవించాలని ప్రశ్నించారు. ప్రజలు ఆరోగ్యకరంగా, సంతోషంగా ఉంటేనే ప్రభుత్వాలను గుర్తుపెట్టు కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. ప్రభుత్వ తీరు తెన్నులు ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దు నిద్రలోంచి లేచి ప్రజల సమస్యలు పరిష్కరిస్తే మంచిదని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.