ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే “జనంకోసం జనసేన”: పాటంశెట్టి

గోకవరం ఎంపీడీవో కిషోర్ కుమార్ తో పాటంశెట్టి సూర్యచంద్ర

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనంకోసం జనసేన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి తెలిపారు. ఆయన గోకవరం మండలంలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి తోడుగా ఉంటూ, “జనంకోసం జనసేన” అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలపై ఎంపీడీవో కిషోర్ కుమార్ కు ప్రజల సమస్యల తో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ “జనంకోసం జనసేన” కార్యక్రమం నీటితో ఎనిమిది రోజులు పూర్తయిందని, మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నా తక్షణ కర్తవ్యం అని అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను నా సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మండల ప్రజలకు తెలియజేశారు. సోమవారం నాడు కొన్ని సమస్యలను అధికారులకు తెలియజేశామని, ఆ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనడం శుభసూచకమని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీకి తెలియపరిస్తే ప్రజలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.