సరికొత్త కరోనా ఆంక్షలను విధించిన కర్ణాటక

కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సరికొత్త ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లిళ్లు, రాజకీయ వేడుకలకు 200 మందికి మించి హాజరు కాకూడదని షరతు విధించింది.

క్లోజ్డ్ స్పేస్ లో పెళ్లిళ్లకు 100 మందికి మించి హాజరు కాకూడదని తెలిపింది. పుట్టినరోజులు, ఇతర వేడుకలకు బహిరంగ ప్రదేశాల్లో అయితే 50 మంది, క్లోజ్డ్ ఏరియాల్లో అయితే 25 మందికి మించి హాజరు కాకూడదని షరతు విధించింది. మతపరమైన వేడుకలను పూర్తిగా నిషేధించినట్టు తెలిపింది.

వేడుకలు జరిగే ప్రాంతాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని చీఫ్ సెక్రటరీ పి.రవికుమార్ తెలిపారు. ఈ ఆంక్షలను అందరూ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని… ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, ఐపీసీ, ఇతర చట్టాల కింద చర్యలు తీసుకోవాలని అన్నారు.