వరుసగా పదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్.. నేడు ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా వరుసగా పదోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగే పార్టీ ప్లీనరీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తెరాస పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిపై శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షుడిగా 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పురుడుపోసుకుంది. ఆ తర్వాత వరుసగా జరిగిన ప్లీనరీల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వచ్చారు. నేడు జరగనున్న ప్లీనరీ పదోది కాగా, ఈసారి కూడా పార్టీ నేతలు ఆయననే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా సుదీర్ఘకాలంపాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారి జాబితాలో కేసీఆర్ కూడా చేరనున్నారు.