రోజా నోరు అదుపులో పెట్టుకో..
• తిరుపతి మీడియా సమావేశంలో వీర మహిళల హెచ్చరిక
రాష్ట్రంలో గంటకు ఓ అత్యాచారం జరుగుతుంటే ఆపడం చేతకాదు కానీ వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు లేదని జనసేన వీర మహిళా విభాగం నాయకులు మండిపడ్డారు. నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేసి తనకు ఓటేసిన ప్రజలను శ్రీమతి రోజా ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. మంత్రి పదవి వచ్చి శ్రీమతి రోజాను నగరి ప్రజలు గడప కూడా తొక్కనీయడం లేదన్నారు. శ్రీమతి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడేందుకే ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు. దిశ యాప్ తో అత్యాచారాలు ఆగిపోతాయి.. గన్ కంటే ముందు జగన్ వచ్చేస్తాడు అని చెప్పిన రోజా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే ఆమె స్థానం ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధికి దూరం చేసి నిరుద్యోగాంధ్రగా మార్చిన దద్దమ్మ ముఖ్యమంత్రన్నారు. శ్రీమతి రోజా జగన్ రెడ్డికి దత్తపుత్రిక అన్నారు. విధానపరంగా లేని విమర్శలకు విలువ ఉండదన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి ఆకుల వనజ, వీర మహిళలు శ్రీమతి కీర్తన, శ్రీమతి లత, శ్రీమతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.