బిజెపిలో చేరిన ఖుష్బూ

నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజానామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఖుష్బూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం (అక్టోబర్ 12) జరిగిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా.. కుష్బూకు కాషాయం కండువా కప్పి పార్టీ అభ్యర్థిత్వాన్ని అందించారు. సినీ నటిగా గుర్తింపు సాధించిన కుష్బూ సుమారు ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వివిధ అంశాలపై గళం వినిపించారు. పార్టీలో కీలక పదవులు అనుభవించారు. అయితే.. ఇటీవల ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ అంశాలతో ఆమె మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతలు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని.. ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఈ మేరకు ఖుష్బూ సుందర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.