శిథిలావస్థ భవనాలను ఖాళీ చేయించండి

నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు.