కొవిషీల్డ్‌ కన్నా కొవాగ్జిన్‌ మెరుగైన ఫలితాలు: కేంద్రం

దేశంలో కరోనా నివారణకు అందిస్తున్న వ్యాక్సిన్లలో కొవిషీల్ట్‌ కన్నా కొవాగ్జిన్‌ అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నట్లు వెల్లడైంది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే తెలిపిన వివరాల ప్రకారం… ఇప్పటి వరకు కోవిషీల్డ్‌ తీసుకున్న 43 లక్షల మందిలో 8,402 మందికి (0.192) ప్రతికూల ప్రభావాలు కనిపించగా… అంటే 0.192 శాతం మంది ప్రభావితమయ్యారు. అదే కోవాగ్జిన్‌ తీసుకున్న 84 వేల మంది లబ్ధిదారుల్లో 81 మందిలో (0.096) మాత్రమే ప్రతికూలత కనిపించినట్లు తెలిపారు. అంటే 0.096 మందిలో మాత్రమే ప్రభావం చూపింది. కొవీషీల్డ్‌తో పోల్చితే 0.1 శాతం మంది తక్కువగా కోవిగ్జిన్‌ తీసుకున్న వారు ప్రతికూలంగా ప్రభావితమౌతున్నారు. దేశంలో టీకా తీసుకున్న వారిలో ఈనెల 4వ తేదీ వరకు 19 మంది మృతి చెందారని వివరించారు. అయితే మరణాలకు టీకా కారణం కాదని చెప్పారు. ఇప్పటి వరకు టీకా తీసుకుని..ప్రతికూల ప్రభావం చూపిన వారిలో 25 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందారని, మొత్తం లబ్ధిదారుల్లో ఇది 0.0005 శాతమేనని అశ్విని చౌబే వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన 21 రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వైద్య రంగ, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించిన ఘనత భారత్‌కే దక్కిందని పేర్కొన్నారు. దేశంలో 25.7 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా నుండి కోలుకున్నట్లు తెలిపారు. డిసెంబర్‌- జనవరి మధ్య చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. వైద్యులు, నర్సుల్లో అత్యధికంగా 26.6 శాతం మందిలో యాంటీ బాడీలున్నట్లు తెలిపారు.