లారెస్ ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

పరవాడ ఫార్మా సిటీలోని లారెస్ ఫార్మా సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థిక పరిహారం ఇవ్వడంతోపాటు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో ఉన్న మరో కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. విశాఖ ప్రాంతంలోని ఫార్మా పరిశ్రమల్లోనూ, ఇతర పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారులు, సంబంధిత కమిటీల సభ్యులు ఏ మేరకు పని చేస్తున్నారనే ప్రశ్న ప్రమాదాలు సంభవించిన ప్రతిసారీ ఉత్పన్నమవుతుంది. విశాఖ ప్రాంతంలోని ప్రతి పరిశ్రమలోనూ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.