తెలంగాణలో లాక్ డౌన్.. మినహాయింపులు ఇవే..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ విధించడం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోజులో 4 గంటల పాటు కార్యకలాపాలు, మిగిలిన 20 గంటలు లాక్ డౌన్. అయితే, ఈ లాక్ డౌన్ అన్ని రంగాలకు వర్తించదు. కొన్ని అత్యవసర సర్వీసులు, రంగాలను లాక్ డౌన్ నుంచి మినహాయించారు. మే 20న తెలంగాణ క్యాబినెట్ మరోసారి సమావేశమై లాక్ డౌన్ పై సమీక్ష జరపనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వ లాక్ డౌన్ నుంచి అనేక రంగాలను మినహాయించింది.

అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.

ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల తయారీ సంస్థలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపుల కార్యకలాపాలకు అనుమతి.

వైద్య రంగం, ఫార్మా రంగం, మెడికల్ డిస్ట్రిబ్యూషన్, ఆసుపత్రుల సిబ్బందికి ప్రత్యేక పాసులు.

33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ,

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు.

యథావిధిగా విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ వ్యవస్థల కార్యకలాపాలు.

కోల్డ్ స్టోరేజి, వేర్ హౌస్ కార్యకలాపాలకు అనుమతి.

బ్యాంకులు, ఏటీఎంల కార్యకలాపాలు యథాతథం.

వ్యవసాయ రంగానికి చెందిన అన్ని రకాల కార్యకలాపాలకు మినహాయింపు.

వంట గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలు, సరఫరా కొనసాగింపు.

పెళ్లిళ్లకు 40 మంది వరకే అనుమతి.

అంత్యక్రియలకు 20 మందికే అనుమతి.

జాతీయ రహదారులపై పెట్రోల్ బంకులు కొనసాగింపు.

తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల నిర్వహణకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు.

ఉపాధి హామీ పథకం పనులు కొనసాగింపు.