పనితీరు చూసి ఓటు వేయండి: కేసీఆర్‌

హైదరాబాద్‌ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. సభలో మాట్లాడుతూ ప్రజలు పనితీరును బేరీజు వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచనలు చేశారు. ప్రభుత్వం, నేతలు అభివృద్ధి చేస్తున్న తీరును బట్టి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పరిణతి సాధించిందని పేర్కొన్నారు.

ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఓటు వేస్తే సేవ చేసే మంచి నాయకులు పుట్టుకొస్తారని.. 2001 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిన సమయంలో ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారని పేర్కొన్నారు. తాను రాష్ట్రాన్ని నడపలేనని ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారని కానీ ఆరు సంవత్సరాలలో వారి అంచనాలు తలక్రిందులు అయ్యేలా పాలన సాగించానని కేసీఆర్ తెలిపారు.

గతంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవని ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని.. తెలంగాణ వచ్చిన తరువాత 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య టీఆర్ ఎస్ పార్టీని ప్రజలు నమ్మి దీవించారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని తెలిపారు.

నగరంలో 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీరు ఇచ్చామని.. అపార్టుమెంట్ల విషయంలో కూడా 20 వేల లీటర్ల పథకం వర్తిస్తుందని అపార్టుమెంట్ వాసులకు మంచి శుభవార్త చెప్పారు. ఈ నిర్ణయం శాశ్వతంగా అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.

‘హైదరాబాద్‌ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని’ సీఎం కోరారు.