మద్దిలేరు వాగుకు మరమ్మత్తులు చేపట్టాలి: జనసేన డిమండ్

శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి: అయ్యా కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పెడబల్లి వెంకట సిద్ద రెడ్డి గారు….!! మద్ది లేరు వాగుకు రాయచోటి రోడ్డు నుంచి ఎన్.జి.ఓ కాలనీ వరకు ప్రొటెక్షన్ వాల్ తో పాటుగా బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం అని కదిరి నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చిన హామీ మరచిపోయారా..??

2019 ఎన్నికల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దిలేరు వాగు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ గోడను నిర్మిస్తానని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి రాగానే ఆ మాట మరచిపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి మద్దిలేరు వాగు మొత్తం కోతకు గురి అయ్యి వరదనీరు మొత్తం ప్రజలు నివసిస్తున్న ఇండల్లోకి చేరాయి. ఆ ఆనవాలు నేటికీ కనపడుతున్నా మీరు కానీ.. అధికారులు కానీ మద్ది లేరు వాగు గురించి ఆలోచన చెయ్యలేదు. మీ నిర్లక్ష్యం కారణంగా కదిరి నుంచి హిందూపురం, బెంగళూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిలో వరదలకు మద్ది లేరు వాగుకు ఆనుకొని ఉన్న రహదారి మొత్తం కోతలకు గురవుతోంది. దీని కారణంగా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాహనాలు వాగులో పడి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా అధికారులు, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే స్పందించి వాగు మరమ్మత్తు పనులు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానిక ప్రజల తరపున కదిరి జనసేన పార్టీ తరపున సత్య సాయి జిల్లా జనసేన కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల డిమండ్ చేసారు.