జనసేనాని జన్మదిన వేడుకలను విజయవంతం చేయండి: గురాన అయ్యలు

విజయనగరం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 30వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న హొటల్‌ జిఎస్‌ఆర్‌ వద్ద జనసేన రాఖీల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేశారు. 31వ తేదీన పలు వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయనున్నామన్నారు. అలాగే 1వ తేదీన పర్యావరణ పరిరక్షణ కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. 2వ తేదీన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేయడంతో పాటు ఉదయం కోట జంక్షన్‌ వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గాజులరేగ, కోట జంక్షన్‌, కంటోన్‌మెంట్‌ గెంజిపేట ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందుల పంపిణీ చేస్తామన్నారు. అదేరోజు మధ్యాహ్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి ఆన్‌లైన్‌ ద్వారా విరాళాలు పంపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సేవా కార్యక్రమాలతో పాటు పలు వార్డుల్లో బర్త్‌డే కేక్‌ కటింగ్‌, వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.