నాదెండ్ల మనోహర్‌ పర్యటనను విజయవంతం చేయండి

విజయనగరం, ఈనెల 29వ తేదీన జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని జనసేన నాయకులు తెలియజేశారు. గురువారం స్థానిక జి.ఎస్‌.ఆర్‌. హొటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు గురాన అయ్యలు, లోకం ప్రసాద్‌, గిరడ అప్పలస్వామి, ఆదాడ మోహనరావు, బాబూ పాలూరి, మర్రాపు సురేష్‌, తుమ్మగంటి సూరినాయుడు, విసినిగిరి శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన చీపురుపల్లి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్‌ పర్యటించి వైకాపా నాయకుల దాడిలో గాయపడిన జనసైనికులను పరామర్శిస్తారని తెలియజేశారు. అనంతరం విజయనగరం పట్టణంలో జి.ఎస్‌.ఆర్‌. హొటల్‌లో ఏర్పాటు చేయనున్న సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని కొత్తగా నియమించబడిన మండల పార్టీ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేస్తారన్నారు. అనంతరం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చిస్తారన్నారు. అలాగే మొదటి నుండి పార్టీ కోసం కష్టపడుతున్న జనసైనికులు, వీరమహిళలతో మాటామంతి కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతమే ధ్యేయంగా పార్టీ నాయకులందరూ ఏకతాటిపై పనిచేస్తామని ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోని ముఖ్య నాయకులందరూ అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జనసేన నేతలు మిడతాన రవికుమార్‌, త్యాడ రామకృష్ణ (బాలు) తదితరులు పాల్గొన్నారు.