దివ్యాంగుల కోసం మంచు లక్ష్మి సైక్లింగ్‌..!

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు కూతురు మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. స్పోర్ట్స్‌లో రాణించాలని పట్టుదలతో ఉన్న పేద దివ్యాంగులకు అండగా నిలబడ్డారు. క్రీడలపై ఆసక్తి ఉన్న పేద దివ్యాంగులకు ”ఆదిత్య మెహతా ఫౌండేషన్‌” అనే సంస్థ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి నిధులు సేకరించి ఇవ్వాలని మంచు లక్ష్మీ సైకిల్‌పై వంద కిలోమీటర్లు పయనించి దాదాపు రూ.5 లక్షలను ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగా 20 రోజులుగా చేస్తున్న సైక్లింగ్‌ నేటితో ముగిసింది. గతంలో కూడా మంచు లక్ష్మి 35 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేశారు. తాజాగా 100 కిలోమీటర్లు సైక్లింగ్‌ పూర్తిచేశారు. పారా స్పోర్ట్స్‌ అకాడమీ రిహాబ్‌ సెంటర్లోని పారా అథ్లెట్ల కోసం విరాళాలు సేకరించేందుకు మంచు లక్ష్మి ఈ కార్యక్రమం చేపట్టారు. పారా సైక్లింగ్‌ జాతీయంగా, అంతర్జాతీయంగా పతకాలను సాధించిన ఆదిత్య మెహతా ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్‌ నడుస్తోంది. ఈ ఫౌండేషన్‌కు గత ఆరేళ్ళుగా మంచు లక్ష్మి సేవలు అందిస్తూ.. నిధుల సమీకరణలో ఆదిత్య మెహతాకు తోడుగా ఉంటున్నారు.