తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు..

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం చిరంజీవి రాజమండ్రికి రానున్నారు. కాగా.. శనివారం పవన్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపడుతుండగా, అభిమానులు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలకు చిరంజీవి రానున్నారు. ఆస్పత్రి ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విగ్రహావిష్కరణ చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఘనస్వాగతం చెప్పేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు అభిమానులు.

చిరు టూర్‌ ఇలా ఉంటే, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు పవన్. అక్టోబర్ రెండో తేదీన రాజమండ్రిలో పవన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు. రోడ్ల శ్రమధానంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు రానున్నారు జనసేనాని. రోడ్ల దుస్థితి పరిశీలించి శ్రమదానం చేయనున్నారు పవన్‌కళ్యాణ్. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత కల్పించాలని కోరారు. అటు పవన్ శ్రమదానం నేపథ్యంలో జనసైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నారు నాయకులు. పవన్‌ టూర్‌ రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు నేతలు. చిరు, పవన్ వరుస పర్యటనల నేపథ్యంలో జిల్లాలో సందడి నెలకుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మంచి జోష్‌లో ఉన్నారు.