సందీప్ కిషన్ హీరోగా ‘మైఖేల్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!

సందీప్ కిషన్ యువ కథానాయకులకు గట్టిపోటీ ఇచ్చే ప్రయత్నంలో దూకుడుగా వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘గల్లీ రౌడీ’ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రంజిత్ జయకొడి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

భరత్ చౌదరి – రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘మైఖేల్’ అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రక్తంతో తడిసిన చేతులు .. ఒక చేతికి బేడీలు వేసి ఉన్నప్పటికీ .. మరో చేత్తో శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నతీరు పోస్టర్లో కనిపిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. దాదాపు అది ప్రతినాయకుడి పాత్రనే అనుకోవాలి. ఈ సినిమా కోసం ఆయనను తీసుకోవడంతో మరింతగా అందరిలో ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడించనున్నారు.