‘టూరిజం షార్ట్ ఫిల్మ్’ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రకృతి సహజంగా ఏర్పడిన అద్భుత పర్యాటక కేంద్రం ‘సోమశిల’ పై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ రూపొందించిన ‘టూరిజం షార్ట్ ఫిల్మ్’ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని పర్యాటక కేంద్రాలను గత పాలకులు ఎంతో నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు.

ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలైన కేసీఆర్‌ ఎకో అర్బన్ పార్క్, మన్యం కొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పిల్లలమర్రి, ఉమా మహేశ్వరం, అక్క మహాదేవి గుహలు, ఫర్హా బాద్, సింగోటం, సోమశిల లాంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాలతో పాటు కృష్ణా నది తీరం వెంట ఉన్న ప్రకృతి సహజంగా ఏర్పడిన ఎన్నో సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు తగిన ప్రచారం కల్పించి పర్యాటకులను రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. పర్యాటక ప్రదేశాల విశిష్టత పై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ నేతృత్వంలో టూరిజం షార్ట్ ఫిల్మ్ లను రూపొందించి తగిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉద్యోగుల సంఘం నాయకులు మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.