సాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే మంచి సంప్రదాయం

ఆదివారం జిల్లాలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల రద్దుపై ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు సఫలం కావాలని పేర్కొన్నారు. అలాగే నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే మంచి సంప్రదాయం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో రాగ్యనాయక్‌ను నల్గొండలో నక్సల్స్ హత్య చేస్తే ఆయన భార్య భారతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నసాంప్రదాయం ఉందని గుర్తుచేశారు.

ఎంఎస్పీ ధర విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పప్పు ధాన్యాలను కేంద్రమే కొనుగోలు చేయాలి, ఆయిల్ ఉత్పత్తులపై ప్రోత్సాహకాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రల రైతులకు కొత్త వ్యవసాయ చట్టాలతో పెను నష్టం జరుగుతోందన్నారు. ఎముకలు కొరికే చలిలోనూ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు పోరాడుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ చట్టసవరణ బిల్లుతో తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండిగా వ్యవహరించడం తగదన్నారు. దేశంలో 75 శాతం మంది ఉన్న రైతులను ఎడిపించడం బాగా లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.