అధికారం లేకపోయినా అన్ని వర్గాలకు అండగా నిలచిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్

• బాబాయిని అసెంబ్లీకి పంపండి… దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తారు
• నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు
• పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ ప్రచారం

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి… దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారు స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని తెలిపారు. తాతగారి ఉద్యోగరీత్యా మా కుటుంబం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నివసించింది.. బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురాన్ని మా కుటుంబం మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో శ్రీ వరుణ్ తేజ్ గారు మాట్లాడుతూ “పడి లేచిన కెరటంలా బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓటమిని తట్టుకుని ప్రజల కోసం పదేళ్లపాటు నిలబడ్డారు. శ్రీ చిరంజీవి గారితో సహా మా కుటుంబం మొత్తం బాబాయ్ వెనుకే ఉన్నాం. జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి జన సైనికుడికి ధన్యవాదాలు. నేను మీ లాంటి జన సైనికుడినే. అధికారం చేతిలో లేకున్నా కౌలు రైతుల కష్టాలు తీర్చారు. మత్స్యకారులకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకు అండగా నిలచిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మా బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీ అభ్యర్ధి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలి” అని కోరారు.
గ్రామాల్లో మెగా ప్రిన్స్ రోడ్ షో
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న శ్రీ వరుణ్ తేజ్ గారికి గ్రామ గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి తాటిపర్తి, వన్నెపూడి గ్రామాల మీదుగా శ్రీ వరుణ్ తేజ్ గారు రోడ్ షో నిర్వహించారు. జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా, ఆడపడుచులు దారిపొడుగునా హారతులు పట్టారు. ప్రజలు పూల వర్షంతో ముంచెత్తారు. గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి గాజు గ్లాసు గుర్తులు ప్రదర్శిస్తూ జనసేనకు మద్దతు తెలిపారు. పూల వర్షంలో ముంచెత్తారు. శ్రీ వరుణ్ తేజ్ గారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ, గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు. పర్యటనలో భాగంగా తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. కొడవలి మీదుగా ఈ ప్రచార యాత్ర దుర్గాడ వరకు సాగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ కన్వీనర్ శ్రీ వి. అజయ్ కుమార్, పార్టీ నాయకుడు, నటుడు శ్రీ సాగర్, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు, టీడీపీ యువ నాయకులు శ్రీ గిరీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.