కాపులను నట్టేట ముంచింది ముద్రగడ: తాడేపల్లిగూడెం కాపు నాయకులు

తాడేపల్లిగూడెం, తన స్వార్ధ రాజకీయాల కోసం కాపులను ఉద్యమాల పేరుతో ఉసిగొల్పి నట్టేట ముంచిన ముద్రగడ కాపు నేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తాడేపల్లిగూడెం కాపు నాయకులు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాపు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు ఉద్యమం పేరుతో కాపులకు ఏదో చేస్తారని నమ్మకంతో కాపులంతా ముద్రగడ వైపు వెళ్తే వారికి మిగిలింది కేసులు తప్ప ఏమీ లేవన్నారు. కాపులపై భరోసా ఉంటే భేషరతుగా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సింది పోయి జగన్ వేసే ముష్టి కోసం పాకులాడారని ఆరోపించారు. కాపులలో పెద్ద అని చెప్పుకోవడం తప్ప కాపులకు ముద్రగడ చేసిందేమీ లేదన్నారు. మంత్రి పదవి తీసుకున్న కొట్టు సత్యనారాయణ కాపులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాపులు ఏమైనా నిర్మాణాలు చేపడితే వారి వారిని వేధించడం తప్ప కొట్టు సత్యనారాయణ ఏం చేశారు అన్నారు. కాపు యువకులను రౌడీలుగా చిత్రీకరించి కేసులు పెట్టించారని గుర్తు చేశారు. కాపులంతా నిస్వార్ధ రాజకీయాల వైపు నిలుస్తారని ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు అడబాల నారాయణమూర్తి, గుండమోగల సురేష్, రామిశెట్టి సురేష్, యడ్లపల్లి శ్రీరామ్, అంబటి కృష్ణ, గట్టు గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.