ఎన్‌డీఏ కూటమి విజయం

243 స్థానాలున్న బిహార్‌లో అసెంబ్లీలో ఎన్‌డీఏ కూటమి మ్యాజిక్‌ఫిగర్‌కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించి.. స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికారం చేపట్టేందుకు 122 అసెంబ్లీ స్థానాలు అవసరం కాగా.. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) 124 సీట్లు సాధించింది. మరో ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ 109 స్థానాల్లో విజయం సాధించింది మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ కూటమికి మహాకూటి చివరి వరకు గట్టిపోటీ ఇచ్చింది. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 103 స్థానాల్లో ఫలితాలు వెలువడగా.. ఎన్‌డీఏ కూటమి 54, మహాఘట్‌బంధన్‌ 44 చోట్ల విజయం సాధించింది. ఎన్‌డీఏలో బీజేపీ 32, జేడీయూ 19, వీఐపీ 2, హెచ్‌ఏఎం పార్టీ ఒక స్థానాల్లో గెలుపొందగా 69 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమిలోని ఆర్జేడీ 29, కాంగ్రెస్‌ ఏడు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు ఎనిమిది మంది విజయం సాధించగా.. 69 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఏఐఎంఐఎం మూడు చోట్ల విజయం సాధించగా మరో చోట ఆధిక్యంలో ఉంది. అలాగే బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించగా.. మరో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు.