గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను స్వీకరించిన హీరో నిఖిల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరికి వారుగా మొక్కలు నాటుతూ తమ స్నేహితులు, బంధువులకు ఛాలెంజ్ విసురుతూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్నారు. ఈ క్రమంలో హీరో నిఖిల్, నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో హీరో నిఖిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుందన్నారు. ”మనం స్టాలిన్ సినిమాలో చూశాం. ఒకరు ముగ్గురికి సహాయం చేయాలని.. అదే విధంగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేస్తారు. ఇక్కడ కూడా అదే విధానాన్ని పాటిస్తూ సంతోష్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కూడా సీడ్ గణేష్ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగిందని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం సంతోష్ అన్న చేపట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుందని నిఖిల్ తెలిపారు. కాగా, ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగడం కోసం ’18 పేజీలు’ చిత్ర బృందం సభ్యులు, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, అవికా గౌర్, కలర్స్ స్వాతిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.