ఒక్క ఛాన్స్ అయిపోయింది… జగన్ ను ఇంటికి పంపడమే మిగిలింది

• ఛాన్సు ఇచ్చినందుకు రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాడు
• జగన్ గ్రాబింగ్ యాక్టు నెపం కేంద్రంపై నెట్టేసే కుట్ర
• కూటమి పాలన మొదలైన 100 రోజుల్లోనే గంజాయి ముఠాలకు ముకుతాడు
• సెజ్ బాధిత రైతులకు తగిన న్యాయం చేస్తాం
• ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్

‘2019 ఎన్నికల్లో జగన్ ప్రతి ప్రాంతం తిరిగి అమ్మా…. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కోరాడు. చెల్లెమ్మ నాన్న లేని బిడ్డను.. ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ఆయన చాలా కరెక్టుగానే అడిగాడు. ప్రజలు కరెక్టుగానే అర్ధం చేసుకొన్నారు. 2019లో జగన్ అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చేశారు. ఎన్నో ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి అడిగినందుకు ఒక్క ఛాన్స్ ప్రజలు మాట తప్పకుండా ఇచ్చారు. ఇక చాలు… పాపం అని ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ కే అదే ప్రజలకి భవిష్యత్తు లేకుండా చేశాడు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అంధకారం చేశాడ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్సు చాలు. ప్రజలు ఈసారి వారి భవిష్యత్తుకు ఛాన్సు ఇచ్చుకోవాలి… భరోసా ఇచ్చే కూటమికి ఛాన్సు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాన్ని మళ్లీ పురోగమన బాటలోకి తీసుకెళ్లే పాలనకు అండగా నిలవాలన్నారు. బుధవారం ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే ఛాన్సు ఇది. ఒక్కసారి ఛాన్సు అడిగిన పాలకుడు ఎన్ని దాష్టీకాలు చేశాడో మీకు తెలుసు. మరోసారి అదే తప్పు జరగకుండా చూసుకోండి. నాకు ప్రజల కోసం పోరాటం మాత్రమే తెలుసు. నేను సంపూర్ణంగా ప్రజల కోసం పని చేస్తా. మీరు ఎన్నుకున్నవారితో పని చేయించే బాధ్యత తీసుకుంటాను. పోలవరం పునరావాస బాధితులకు ఎంత అండగా నిలబడతానో, సెజ్ లలో భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకీ అంతే అండగా నిలబడి న్యాయం చేస్తాను.
• ముసాయిదా ఇస్తే…
ప్రజల ఆస్తులన్నీ కాజేసే కుట్రతో తీసుకొచ్చిన జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంశాన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు కేంద్రం మీదకు తోసి చేతులు దులుపుకుందామనే కొత్త పన్నాగం పన్నారు. కేంద్రం చట్టం తీసుకొచ్చిందని కొత్త పాట పాడుతున్నారు. కేంద్రం దేశంలోని అన్ని రకాల భిన్నమైన పరిస్థితులు, పరిణామాలు, ఇతర బోలెడు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కొన్ని చట్టాలను ముసాయిదా రూపంలో రాష్ట్రాలకు పంపుతుంది. దాన్ని రాష్ట్రాలు తమకున్న పరిస్థితులకు అనుగుణంగా ముసాయిదాను అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. వైసీపీ ప్రజల ఆస్తులపై కన్నేసి, మొత్తం దోచుకోవాలనే కోణంలో మరిన్ని అదనపు అంశాలను జోడించి, తమకు అనుకూలంగా ఉండేలా ‘‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు’’ను తీసుకొచ్చింది. వైసీపీ ప్రజల ఆస్తులను కాజేయడానికి చేసిన కుట్ర. ఈ చట్టం ప్రకారం మన భూమి ఎవరైనా కబ్జా చేస్తే కనీసం కేసులు, కోర్టులు కూడా ఉండవు. జగన్ నియమించిన అధికారుల వద్దకు వెళ్లాలి. వారు ఎవరి మాట వింటారో అందరికీ తెలుసు. మన ఆస్తిలో మనం కొన్ని రోజుల పాటు ఉండకపోతే అది అన్యాక్రాంతం అయి, మనకు తెలియకుండానే చేతులు మారిపోతుంది. ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు. జిరాక్స్ పత్రాలే ఇస్తారట. ఒరిజినల్స్ ప్రభుత్వమే ఉంచేసుకొంటుంది. అత్యవసరంలో మన ఆస్తులు తాకట్టు పెట్టుకోవడానికి కూడా కుదరదు. ఇలాంటి సవాలక్ష నిబంధనలు ఈ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టులో ఉన్నాయి. జగన్ కు ఓటేస్తే మన సొంత ఆస్తులన్నీ గాలిలో దీపాలే అవుతాయి.
• ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా… ఆరోగ్య విప్లవం అవుతుంది
ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, దానికి సంబంధించి డిజిటల్ కార్డుల పంపిణీ అనేది దేశంలోనే ఓ ఆరోగ్య విప్లవం అవుతుంది. పేదవాడు తనకు కష్టం వస్తే దర్జాగా కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవచ్చు. తమకు అందుబాటులో ఉండే పెద్ద ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు. దీనికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. దీంతో పేదలకు పూర్తి స్థాయి ఆరోగ్య భరోసా లభిస్తుంది. దీంతోపాటు మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేల సాయం, 10 మందికి ఉపాధినిచ్చే స్టార్టప్, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల రాయితీ ఇవ్వడం అనేది యువతను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతుంది. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉపాధి కోసం కూటమి కట్టుబడి ఉంది. ఉపాధి జోన్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉండే ఉద్యోగాలను యువతకు అందేలా చేస్తాం. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా యువత నైపుణ్య గణాంకాలపై సర్వే చేస్తాం. యువ శక్తి ఆలోచనలు, వారు ఏం కావాలనుకుంటున్నారు.. వారిలో ఉన్న ప్రతిభ ఏమిటి అనే దానిపై సర్వే చేసి, దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తాం. చేయూత అందిస్తాం. కూటమి పాలన యువత కల అయిన మెగా డీఎస్సీతోనే శుభప్రదంగా మొదలు అవుతుంది. ప్రజల కోసం, యువత కోసం ఓ సగటు కూలీలా పని చేస్తాను. వారికి నిరంతరం అందుబాటులో ఉండే పెద్దన్న పాత్రను తీసుకుంటాను. చాలా మంది కోరుకుంటున్నట్లు సీఎం పదవి అనేది కాలం నిర్ణయిస్తుంది. అప్పటివరకు నా డ్యూటీ నేను నిజాయతీగా నిర్వహిస్తాను. ప్రజల కోసం, ప్రజల్లో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడే సేవకుడిని అవుతాను.
• కన్నబాబురాజు కాదు.. కన్నాల బాబు
యువత ఈ వైసీపీ పాలన మీద ఉన్న కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియక వేదన పడుతున్నారు. నా సమావేశాలకు ఎంతో ఉత్సాహంతో వస్తున్న వారి ఊపు చూసి ఒకటే చెబుతున్నా.. యువత అంతా ఈసారి జగన్ కు చెప్పండి.. నిన్ను ఓడించే దాకా తగ్గెదేలే అని.. ఇంటికి పంపే వరకు విశ్రమించేది లేదు అని చెప్పండి. ఓ చిన్న సోషల్ మీడియా పోస్టు పెడితేనే కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది. గడగడపకు కార్యక్రమంలో ఓ విద్యార్థి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఫీజు రియంబర్సుమెంటు రాలేదని అడిగితే ఆ విద్యార్థిని చావబాదారు. ఈ ఎమ్మెల్యే సింహాచలం ఆలయ భూములను ఇష్టానుసారం ఆక్రమించి భవంతులు కడుతున్నారు. 22 ఏ లోని నిషేధిత భూములపైనా కన్నేశారంటే ఎంతకు తెగించారో అర్ధం అవుతుంది. నియోజకవర్గంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఈయనకు పర్సంటేజీ ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. నేను పదేపదే చెబుతున్నది అదే. ఎంత గొప్ప చట్టాలు, రాజ్యాంగం తీసుకొచ్చినా పాలకుడు ఆలోచన చెడ్డది అయినప్పుడు ఎంత మంచి రాజ్యాంగం అయినా వృథా. వైసీపీ పాలనలో అదే జరుగుతోంది. ప్రకృతి సంపదను ఇష్టానుసారం వైసీపీ నాయకులు కాజేస్తున్నారు. వైసీపీ పాలన మొదలై, వారి గూండాయిజం ఎక్కువ అయినపుడు, అంతా భయంలో ఉన్నపుడు జనసేన ఈ రాష్ట్రం వెన్నెముకలో ధైర్యం నింపింది. పోరాడాలనే స్ఫూర్తిని రాజేసింది. అదే స్ఫూర్తిని పాలనలోనూ చూపిస్తాం. అదే కూటమి బలం అయింది. కూటమి పాలనలో గంజాయి రవాణా చేసిన వారిని, మత్తు పదార్థాలు యువతకు అలవాటు చేసిన వారిని వదిలిపెట్టబోం. పాలన మొదలైన 100 రోజుల్లోపే గంజాయి ముఠాలకి ముకుతాడు వేస్తాం. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరిగేలా చట్టాలను కఠినతరం చేస్తాం. నేను సగటు మనిషిలా ఉండిపోవాలని రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషికి కష్టం వస్తే వారి గొంతు అవడానికి వచ్చాను. వారి కన్నీళ్లకు అండగా నిలబడటానికి వచ్చాను. ఎలమంచిలి నియోజవకర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి గాజు గ్లాసు గుర్తుపై, అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాను” అన్నారు.