శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

•ఆలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం మధ్యాహ్నం గుంటూరు పాత నగరంలోని చారిత్రక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ శతాబ్ది వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మొదటి రోజు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారి ప్రసాదంతోపాటు ఆశీర్వచనాలు అందచేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి అమ్మవారి శతాబ్ది ఉత్సవ వేడుకలకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ కమిటీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఐదు రోజుల పాటు జరగనున్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఈ రోజే అంకురార్పణ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్, పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.