గాజు గ్లాస్ ను ఎక్కడ పెట్టాలో తుప్పు ఫ్యానును ఎక్కడ ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు: పత్తి చంద్రశేఖర్

అనంతపురం, గాజు గ్లాస్ ను ఎక్కడ పెట్టాలో తుప్పు పట్టిన ఫ్యాన్ ను ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పత్తి చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసేందుకే సిద్ధం సభ నిర్వహించినట్టు ఉందన్నారు. 99 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గుండెల మీద చెయ్యి వేసుకుని మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన విషయాన్ని ఎందుకు ఈ సభలో ప్రస్తావించలేదన్నారు. సిపిఎస్ రద్దుపై ఉద్యోగ ఉపాధ్యాయులకు సమాధానం ఎందుకు చెప్పలేదన్నారు. కేవలం తప్పుడు వ్యాఖ్యలు, అబద్ధపు మాటలకే సిద్ధం సభ పరిమితమైందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పై మరోసారి వ్యక్తిగత విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.