ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలి: పవన్ కళ్యాణ్

మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలు. బుధవారం నుంచి మొదలవుతున్న సమ్మక్క సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనం. అడవి బిడ్డల వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకలు ఈ దేవతలు, తెలంగాణాలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికే తలమానికం. దేశం నలుమూలలోని గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల జాతర నయానందకరం, భక్తి ముక్తిదాయకం. మనదేశంలో కుంభమేళా తరవాత కోట్లాదిమంది ఈ జాతరకు ప్రతీసారి తరలి వస్తున్నారంటే భక్తులు సమ్మక్క-సారలమ్మను ఎంతలా ఆరాధిస్తారో అవగతమవుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారం మేడారం గద్దె అని భక్తుల విశ్వాసం. ఈ జాతర ఆద్యంతం గిరిజన సంప్రదాయంతో నయనానందకరంగా.. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తెలంగాణవాసులతో పాటు దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడి, కరుణ కటాక్షాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రణామాలు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.