వాయిదా పడిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

హైదరాబాద్ మణిహారంగా రూపొందిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రారంభోత్సవ వివరాలను అధికారులు తెలియజేయనున్నారు. ముందుగా ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. అయితే వాయిదాకు గల కారణాలను వెల్లడించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కురుస్తున్న అధిక వర్షాల వల్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. రెండేళ్ళలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే.