పవర్ స్టార్ కొత్త చిత్రం టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు

పవన్ కల్యాణ్, రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న రీమేక్ చిత్రం టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా టైటిల్ తో పాటే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15 ఉదయం 9.45 గంటలకు చిత్రబృందం టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనుంది. ఆగస్టు 15న పవర్ తుపాను రానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రోమాంఛక అనుభూతి పొందేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు చిత్రబృందం పంచుకున్న అప్ డేట్ లో పవన్ కల్యాణ్ లుంగీతో దర్శనమిచ్చారు.

మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్, రానా ప్రధాన పాత్రలతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తోంది. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.