లార్డ్స్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 364 ఆలౌట్… ఆండర్సన్ కు 5 వికెట్లు

లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 5 వికెట్లు తీయడం విశేషం. లంచ్ తర్వాత చివరి వరుస ఆటగాళ్లు బ్యాట్లెత్తేయడంతో భారత ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. షమీ (0), ఇషాంత్ (8), బుమ్రా (0) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. సిరాజ్ (0) నాటౌట్ గా మిగిలినా అతడు చేసిన పరుగులు ఏమీలేవు.

అంతకుముందు, రవీంద్ర జడేజా 40 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. వీరిద్దరినీ మార్క్ ఉడ్ అవుట్ చేశాడు. సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్ 129 పరుగులు చేశాడు. రహానే (1) విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ కు 5, రాబిన్సన్ కు 2, మార్క్ ఉడ్ కు 2 వికెట్లు లభించాయి. స్పిన్నర్ మొయిన్ అలీ ఓ వికెట్ తీశాడు.