యుద్దానికి సిద్దం కండి

  • ప్రజలు పధకాలు కాదు.. స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు
  • జగన్ దగ్గర డి3 ఫార్ములా ఉంటే జనసేన, టిడిపి దగ్గర పీపుల్స్ ఫార్ములా ఉంది
  • శ్రీకాళహస్తి, పీలేరు, మదనపల్లి జనసేన, టిడిపి సమ‌న్వయ సమావేశాల్లో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: రాష్ట్రంలో ప్రజలు పధకాలు కన్నా ఓటు వేసే స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. గురువారం ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. శ్రీకాళహస్తి, పీలేరు, మదనపల్లిల్లో జరిగిన జనసేన, టిడిపి సమన్వయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ చిత్తూరు జిల్లాను ఫ్యాక్షన్ జిల్లాగా మార్చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయం కాదు… యుద్దం చేయాలన్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలన్నా అనుమతి కావాలని పోలీసులు చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు రాముడికి లక్ష్మణుడిలా పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారన్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు… ఆశయం ఉన్న పవన్ కళ్యాణ్ ఏకమైంది వారి రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్నారు. ప్రజలను గెలిపించడం కోసమే జనసేన, టిడిపి ఏకమయ్యాయని తెలిపారు. ప్రజా స్వామ్యాన్ని జగన్ భూ స్థాపితం చేశారన్నారు. అంధకారంలో ఉన్న రాష్ట్రానికి వెలుగులు పంచేందుకే ఇద్దరు నేతలు తపనపడుతున్నారన్నారు. వైసీపీకి ఓటు వేయకూడదని ప్రజలు ఫిక్స్ అయ్యారన్నారు. వైసిపి నాయకులు వాలంటీర్ల ద్వారా ఓట్లు తొలగిస్తున్నారన్నారు. ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తమ కుటుంబంలో 15 మంది ఓటర్లు ఉంటే అందులో 5 ఓట్లు తొలగించారన్నారు. శకుని చేతిలో పాచికలా వైసిపి చేతిలో దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. 30 రోజుల పాటు దొంగ ఓట్లుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందులో జనసేన, టిడిపి నేతలు పాల్గొని క్షుణ్ణంగా దొంగ ఓట్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జగన్ దగ్గర డి3 (ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లు) ఫార్ములా ఉంటే జనసేన టిడిపి వద్ద పీపుల్స్ (ప్రజా మద్దతు) ఫార్ములా ఉందన్నారు. శ్రీకాళహస్తితో పాటు అనేక నియోజకవర్గాల్లో జనసేన, టిడిపి నాయకులపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి సమావేశంలో టిడిపి ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన ఇన్ చార్జ్ కోటా వినుత, కొట్టే సాయి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, పీలేరు సమావేశంలో టిడిపి ఇన్ చార్జ్ కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన ఇన్ చార్జ్ దినేష్, కడప రవి, బాటసారి, మదనపల్లి సమావేశంలో అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, టిడిపి ఇన్ చార్జ్ దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ భాషా, జనసేన కో కన్వీనర్ రాందాస్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దారం అనిత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.