రాహుల్ – ప్రియాంకలను అడ్డుకున్న పోలీసులు..

గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయల్దేరారు. అయితే యమునా హైవే ఎక్స్‌ప్రెస్ వద్దకు వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ కార్యకర్తలు, నేతలు కూడా నడక ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కిందపడ్డారు. రోడ్డుపై కేవలం ప్రధాని నరేంద్ర మోదీయే నడవాలా? సామాన్యులకు నడిచే హక్కులేదా?” అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తోసేసి, లాఠిఛార్జ్ కూడా చేశారని ఆయన ఆరోపించారు. తనను పోలీసులు తోసేస్తే కింద పడ్డాని అన్నారు. తాను ఏరకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్టు చేశారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. యూపీలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.