తుని రైలు దహనం ఘటనలో ముద్రగడకు రైల్వే కోర్టు షాక్

కాకినాడ: తుని రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో సహా, నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. మార్చి 3న కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ముద్రగడతో పాటు సమన్లు జారీ అయిన వారిలో మంచాల సాయి సుధాకర్ నాయుడు, మరికొందరు నిందితులు ఉన్నారు. 2016 జనవరి 31న తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం జరిగింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. కాపు ఐక్య గర్జన వేదిక పేరుతో ఆరోజు తునిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఆ సభ ముగిసిన అనంతరం, సభా ప్రాంగణానికి కొద్ది దూరంలోనే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ తగలబడింది.  దీనికి సంబంధించి అప్పట్లో రైల్వే చట్టం సెక్షన్ 146,147,153,174 కింద ముద్రగడతో సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే.